సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చిరు.. ఇప్పుడు కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అలాగే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్. సినిమాలతోనే కాదు చిరంజీవి తన జీవితానుభవాలను, స్ఫూర్తిదాయకమైన సందేశాలను తరచుగా పంచుకుంటూ ఉంటారు. ఈసారి ఆయన కప్ప కథ చెప్పారు. దాని ద్వారా నెగిటివిటీని ఎలా అధిగమించాలో వివరించారు మెగాస్టార్. ఒక తాడు సాయంతో ఓ బావిలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న కొన్ని కప్పల కథను ఆయన చెప్పారు. ” బావిలోని కప్పలు తాడు ఎక్కుతుండగా, కింద ఉన్న మిగిలిన కప్పలు “ఇది అసాధ్యం, మీరు ఎక్కలేరు, మీరు కింద పడిపోతారు” అని నిరుత్సాహపరిచే మాటలు పదేపదే చెబుతూ ఉన్నాయట. ఈ ప్రతికూల మాటలు విన్న చాలా కప్పలు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నాయి, మరికొన్ని ఆత్మవిశ్వాసం కోల్పోయి మధ్యలోనే కింద పడిపోయాయి. అయితే, ఒక కప్ప మాత్రం అన్ని అడ్డంకులను దాటుకుని తాడు పైదాకా విజయవంతంగా చేరుకొని ఆ బావి నుంచి బయట పడిందట.. మిగిలిన కప్పలు దానిని అభినందించినప్పుడు, ఆ కప్ప చెవిటిదని తెలిసిందట. అది కిందనున్న నెగిటివ్ మాటలను వినలేకపోయింది, అందువల్ల తన లక్ష్యంపై మాత్రమే దృష్టి సారించగలిగిందని చిరంజీవి చెప్పుకొచ్చారు.